న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కేబుల్ టివి, డిటిహెచ్ ఆపరేటర్లను హెచ్చరించింది. కొత్త పన్ను నిబంధనల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాయ్ హెచ్చరికలు జారీ చేసింది. చందాదారులు, కేబుల్ నిర్వాహకుల వ్యవస్థలను త్వరలోనే ఆడిట్ చేయనున్నట్లు తెలిపింది. సబ్స్ర్కైబర్ మేనేజ్మెంట్ ఆడిట్ను త్వరలో ప్రారంభించనున్నామని, ఇతర ఐటి విధానాలను చేపట్టనున్నామని ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ అన్నారు. నిబంధనలను అనుసరించని కంపెనీలు అందుకు తగిన పర్యవసానాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని, వినియోగదారుడి ఇష్టాయిష్టాలే ప్రధానమని అన్నారు. వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పలువురు పంపిణీదారులు వినియోగదారుల ఎంపిక ప్రకారం ఛానళ్లను ప్రసారం చేయడం లేదని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టనున్నామని అన్నారు.