బ్యాంకాక్: బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ పురుషుల సెమీఫైనల్లోకి భారత బాక్సర్లు అమిత్ పంగల్, కవిందర్ సింగ్ బిష్త్, దీపక్ ప్రవేశించారు. ఇక మహిళల విభాగంలో సోనియా చహల్ ఎంట్రీ సాధించారు. దీంతో వీరందరూ కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కవిందర్ బిష్ఠ్ (56కేజీ) ప్రపంచ ఛాంపియన్ కైరాత్ యెరలియెవ్ (కజకిస్థాన్)కు షాకిచ్ఛాడు. 3-2తో విజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. అమిత్ పంగాల్ (52 కేజీ) 4-1తో హసన్బాయ్ దస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. దీపక్ సింగ్ (49 కేజీ) కూడా తుది నాలుగులో చోటు సంపాదించాడు. మహిళల 57 కేజీల విభాగం జో సన్ వా (కొరియా)పై సోనియా 3-2తో విజయం సాధించి సెమీస్ చేరింది. క్వార్టర్స్లో లవ్లీనా, సీమా పూనియా, రోహిత్లు పరాజయం పొందారు.