విశాఖ, ఆగస్ట్ 19: ప్రేమించని పాపానికి యువతికి నిప్పటించి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన బీమిలి మండలం టి. నగరపాలెంలో చోటు చేసుకుంది. విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం ఇది. అసలు విషయానికొస్తే హరిసంతోష్ అనే యువకుడు రూప అనే యువతిని చాలా కాలంగా వేధిస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు అతన్ని పలుమార్లు హెచ్చరించారు కూడా. తనకు దక్కనిది మరెవరికి దక్కకూడదు అనుకొని టి. నగరపాలెంలోని రూప ఇంటికి చేరుకొని తన ఒంటికి నిప్పటించాడు ఇది గమనించి అడ్డుకోబోయిన యువతి సోదరుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందగా తన సోదరుడిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో తమ బిడ్డల్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. దీని తరువాత విజయనగరం రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో హరిసంతోష్ మృతి చెందాడు. విశాఖలో కలకలం రేపుతున్న ఈ ఘటన పై పూర్తి విషయాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.