ప్రముఖ ఆన్ లైన్ క్యాబ్ బుకింగ్ సర్వీస్ ఓలా తన వ్యాపారంలో మరో ముందడుగు వేయనుంది. ఓలా తన వినియోగదారులు ఖరీదైన ఆడి, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి కార్లను అద్దెకు తీసుకుని, సొంతగా నడుపుకుంటూ వెళ్లే అవకాశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంది. సెల్ఫ్ డ్రైవ్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీస్లో భాగంగా, ఈ ఖరీదైన కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఓలా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం కార్ల తయారీ కంపెనీలైన ఆడి, మెర్సిడెస్, బీఎండబ్ల్యూలతో ఓలా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద బెంగళూరులో లిమిటెడ్గా ఈ సేవలను అందిస్తున్న ఓలా, వచ్చే కొన్ని వారాల్లో ఓలా ఫ్లీట్ టెక్నాలజీస్ ద్వారా ఈ సేవలను విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు రూ.3450 కోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. భారత్లో కొన్ని సవాళ్లు ఉన్నా, ఆ సదుపాయాన్ని ఇక్కడా కల్పించేందుకు ఓలా ప్రయత్నాలు చేస్తోంది. ఉబర్ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకోవడానికి వీలుగా, దేశీయంగానూ ఓలా దూకుడుగా పెట్టుబడులు పెడుతోంది.