హైదరాబాద్: ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు వచ్చిన కొందరు ప్రేక్షకులు వీరంగం ఆడారు. వారు పీకల దాక మద్యం తాగి తోటి ప్రేక్షకులతో అసభ్యంగా ప్రవర్తించారు. వాగ్వాదానికి దిగి స్టేడియంలో హల్ చల్ చేశారు. పీకల్లోతు మద్యం తాగి వచ్చిన ఆరుగురు యువతీ, యువకులు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టారు. వికృత చేష్టలతో సంతోష్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వాగ్వాదానికి దిగారు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంతోష్ ఫిర్యాదు మేరకు సిసిటివి ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కె. పూర్ణిమ(27), కె. ప్రియా(23), సి. ప్రశాంతి(32), వి. శ్రీకాంత్ రెడ్డి(48), ఎల్. సురేష్(28), జి. వేణుగోపాల్(38)లపై 341, 188, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరందరూ హైదరాబాద్ వాసులేనని పోలీసులు తెలిపారు. స్టేడియంలోని కార్పొరేట్ బాక్స్ నెం. ఎస్22 నుంచి వారు మ్యాచ్ వీక్షించినట్లు పేర్కొన్నారు.