కొలంబో: ఆదివారం ఉదయం శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళనుంచి ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ తృటిలో తప్పించుకున్నారు. కొలంబోలోని సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో బస చేసిన రాధికా శరత్ కుమార్ పేలుళ్లకు కొద్ది నిమిషాల ముందే ఈ హోటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో ఆమె పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. బాంబు పేలుళ్ల ఘటన తనను షాకింగ్ కు గురి చేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనను తాను నమ్మలేకపోతున్నాని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 160 కి చేరుకుంది. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొలంబోలోని సెయింట్ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా హోటల్, సిన్నామన్ గ్రాండ్ హోటల్, కింగ్స్బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ ఆదివారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.