ముంభై: జెట్ ఎయిర్వేస్ తీవ్ర అప్పులో ఉండి వాటిని తీర్చలేక మూడు రోజుల క్రితం తమ సేవలను పూర్తిగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే జెట్కు రుణాలు ఇచ్చిన ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల కన్సార్టియం ఈ సంస్ధను బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం నరేష్ గోయల్ను తప్పించింది. కొత్త సంస్థ కోసం బిడ్స్ను ఆహ్వానించింది. మే 10వ తేదీన బిడ్ ఎవరిని వరించనుందో తేలనుంది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా జెట్ ఎయిర్వేస్ పైన కన్నేసిందని వార్తలు వస్తున్నాయి. జెట్లో వాటాను కొనుగోలు చేసేందుకు ముఖేష్ ప్లాన్ చేస్తున్నారట. జెట్ ఎయిర్వేస్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్స్ప్రెషన్ అఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ) సమర్పించలేదని, కానీ బిడ్ దాఖలు చేసిన ఎతిహాద్ ఎయిర్వేస్లో చేరవచ్చునని అంటున్నారు. ఎతిహాద్ ఎయిర్వేస్ యూఏఈకి చెందిన ఎయిర్ లైన్స్. ఇప్పటికే ఇది ఎక్స్ప్రెషన్ అఫ్ ఇంటరెస్ట్ (ఈవోఐ) సమర్పించింది. ఈ బిడ్లో రిలయన్స్ వాటా తీసుకోవచ్చునని అంటున్నారు.