ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్దులలో కొందరు ఆత్మహత్యలు చేసుకొంటుండటం మిగిలిన విద్యార్డుల తల్లితండ్రులను కలవరపరుస్తోంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని వాసవీ భువన అపార్ట్మెంట్స్లో నివశిస్తున్న ధనుంజయనాయుడు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు (ఏపీ ఎంపీ సిఎం రమేశ్ మేనల్లుడు) ధర్మారం (17) గణితంలో ఫెయిల్ అవడంతో ఇంటర్ పరీక్షలు తప్పాడు. తల్లితండ్రులు మందలించడంతో అతను శనివారం అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను అమీర్పేట్ నారాయణ కాలేజీలో చదువుకున్నాడు.
ఇంటర్ ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాములపల్లికి చెందిన ప్రశాంత్ (19), జగిత్యాల జిల్లాకే చెందిన సారంగాపూర్ మండలం పోచంపేటకు చెందిన ఒడ్నాల శివాని(17), కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో నివాసముంటున్న నీరజ(17) ఆత్మహత్యలు చేసుకొన్నారు.