ఈ సారి ఎన్నికలలో తప్పకుండా గెలుస్తామని చెబుతున్న జగన్ మోహన్ రెడ్డి , ఇంకా ఫలితాలే రాలేదు అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయినట్టు పగటి కలలు కంటున్నారని, జగన్ సీఎం అవ్వడం నిజంగా కలగానే మిగిలిపోతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. అయితే ఆయన జగన్కు బహిరంగ లేఖ రాశారు. జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించిన, వాటిని అధిగమించి 80 శాతానికి పైగా ప్రజలు పోలింగ్లో పాల్గొని తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఈ ఐదేళ్ళలో చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాలను ధృష్టిలో ఉంచుకుని మరోసారి చంద్రబాబుకే పట్టం కట్టారు అని అన్నారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఆపద్ధర్మ ప్రభుత్వం అంటున్న మీకు అసలు చట్టాలపై ఎంత అవగాహన ఉందో తెలియడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. మోడీ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కానప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం ఎలా అవుతుంది?’ అంటూ ఆయన ప్రశ్నించారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ఈవీఎంలు పనిచేయకపోయినా జగన్ ఈసీ బాగా పనిచేసిందని అంటున్నారని, దేశ వ్యాప్తంగా 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతుంటే జగన్ ఎందుకు నోరు విప్పడంలేదని, మోదీకీ, కేసీఆర్ కి, జగన్కి ఏజెంటుగా ఈసీ పనిచేసిందని కళా మండిపడ్డారు. ప్రజలంతా టీడీపీ వైపే మొగ్గు చూపారని తెలిసినా జగన్ వైఖరిలో ఇంకా మార్పు రాలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే మే 23న ప్రజలు ఇచ్చిన తీర్పుతో జగన్ తన ఓటును పులివెందుల నుంచి లోటస్పాండ్కు మార్చుకోవడం ఖాయం’ అని కళా వ్యాఖ్యానించారు. పోలవరం నిర్మాణానికి చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తుంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అలా చేయొద్దంటూ మాట్లాడటం సబబు కాదని జగన్ను హెచ్చరిస్తూ మాట్లాడారు.