సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి పోయిన భార్య మీద కోపంతో తన ఇద్దరు కన్నబిడ్డలను కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. పోలీసుల కథనం ప్రకారం....సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్ ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాకు రామచంద్రాపురంకు చెందిన కుమార్ అనే వ్యక్తి మేస్త్రీగా, శిరీష కూలీగా పనిచేస్తున్న క్రమంలో పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మల్లీశ్వరి(10), అఖిల్(6), శరణ్య(4) సంతానం. భార్యపై అనుమానం పెంచుకున్న కుమార్ వేధించసాగాడు. మద్యం తాగొచ్చి భార్య, పిల్లలను కొట్టడంతోపాటు ఈ పిల్లలు తనకు పుట్టలేదనేవాడు. వేధింపులు భరించలేక నెలక్రితం శిరీష పటాన్చెరు మండలం చిన్నకంజర్లలోని పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో పిల్లలను కుమార్ బలవంతంగా తీసుకుని ఇంటికొచ్చాడు. మంగళవారం రాత్రి శిరీష తల్లికి ఫోన్చేసి గొడవపడ్డాడు. ఎవరికో పుట్టిన పిల్లలను నావద్ద విడిచిపెట్టి పోయింది. నీ కూతురిని, పిల్లలను ఏదో ఒకరోజు చంపుతానని బెదిరించాడు. అదేరోజు రాత్రి మద్యం తాగొచ్చి అప్పటికే నిద్రిస్తున్న పిల్లల్లో శరణ్య(4)ను మెడచుట్టూ తాడు బిగించి హత్యచేశాడు. తర్వాత కత్తితో కొడుకు అఖిల్(6) గొంతు కోశాడు. పెద్ద కూతురు మల్లీశ్వరిని కత్తితో పొడువబోతుండగా తేరుకుని బయటకు పరుగులు తీసింది. ఇంటి పక్కన వాళ్లకు విషయం చెప్పడంతో వాళ్లు వచ్చి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.