హైదరాబాద్, ఆగస్ట్ 18: ఈ మధ్య కాలంలో సినీ నటులు, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు లాంటి వారంతా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ మార్గంలో అభిమానులకు చేరువలో ఉండే వారిలో అక్కినేని నాగార్జున చాలా చురుకుగా ఉంటారు. అందుకే ఆయన్ను సామాజిక మాధ్యమం ద్వారా అనుకరించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇటీవలే ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. ఆయన అభిమాని ఒకరు ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్యలో నాగార్జున ర్యాంకు 260 అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై నాగార్జున ఇంత అభిమానం చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ స్పందించారు. భారత్ నుండి నరేంద్రమోదీ, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ఖాన్, దీపికా పదుకొనె, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కొహ్లీ లు టాప్ 100లో చోటు సాధించారు.