లక్నో: లోక్ సభ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ సుప్రీమ్ అఖిలేష్ యాదవ్ గురువారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అఖిలేష్ యాదవ్ యుపిలోని ఆజంఘడ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సమాజ్వాదీ పార్టీకి ఆజంఘడ్ కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఆజంఘడ్ స్థానానికి మే 12న ఎన్నికలు జరగనున్నాయి. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కావడం, ముస్లిం మెజార్టీ ఎక్కువగా ఉండడం తనకు కలిసి వస్తుందని భావిస్తున్న అఖిలేష్ ఆజంఘడ్ను ఎంపిక చేసుకున్నారు. అఖిలేష్ తండ్రి ములాయం సింగ్ మెయిన్పూరి నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీ చేస్తున్నారు. మేనకా గాంధీ కూడా గురువారం తన నామినేషన్ను దాఖలు చేశారు.