న్యూఢిల్లీ: రుణ ఉభిలో ఉండి ఇప్పటికి కోలుకోలేక పోతున్న జెట్ ఎయిర్వేస్ శకానికి శాశ్వత ముగింపు పడింది. 25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ ప్రైవేటు విమాన సంస్థకు అత్యవసర నిధిగా రూ.400 కోట్లు ఇచ్చేందుకు రుణదాతలు నిరాకరించారు. దీంతో విమాన సేవన్నింటిని రద్దు చేస్తూ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘తక్షణమే అంతర్జాతీయ, దేశీయ విమాన సేవలను రద్దు చేస్తున్నాం. బుధవారం రాత్రితో అన్ని సేవలు రద్దు’ అని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. సంస్థకు ఊపిరి పోసేందుకు గాను రుణ సంస్థలు అత్యవసర నిధులు ఇచ్చేందుకు నిరాకరించడంతో విమాన సేవలన్నింటిని రద్దు చేయాల్సి వచ్చిందని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. అత్యవసర నిధులను ఇవ్వకపోవడం వల్ల వేతనాలు, ఇంధనానికి చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఆపరేషన్లను తాత్కాలికంగా రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చామని విమాన సంస్థ వెల్లడించింది. ఆఖరి విమానం బుధవారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు కిందికి దిగనుంది.