హైదరాబాద్, ఆగస్ట్ 18 : ర్యాగింగ్ భూతం మరోసారి పడగలు విప్పింది. ర్యాగింగ్ ను నిర్మూలించడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతున్నప్పటికీ నగరంలో మరో సంఘటన వెలుగు చూసింది. భువనగిరి జిల్లా బీబీనగర్ లోని టీడీఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో గిరిధర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అయితే గిరిధర్ కళాశాల నుంచి హైదరాబాద్ కు తన కాలేజ్ బస్సులో బయలుదేరాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు సీనియర్లు సమీర్, నరసింహా, నరసింహా గౌడ్ లు.. ఈ మధ్య ట్రెండ్ గా మారిన బ్యాక్ బంప్స్ పేరుతో ర్యాగింగ్ చేశారు. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు కొడుతూనే ఉన్నారు. తనను కొట్టకుండా ఉండాలంటే.. 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, ఈ దెబ్బలను తట్టుకోలేని గిరిధర్, బస్సు ఎల్బీనగర్ కు చేరుకోగానే బస్సు నుంచి దిగి పోలీస్ స్టేషన్ లోపలికి పారిపోయాడు. ఇది గమనించిన ఆ ముగ్గురు సీనియర్లు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.