బీజింగ్, ఆగస్ట్ 17: భారత దళాలను వెనక్కి పంపించడానికి తమకు చాలా మార్గాలు ఉన్నాయంటూ మరోసారి తీవ్ర సంచలన వ్యాఖ్యలను చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ప్రచురించింది. డోక్లాం సరిహద్దు సమస్య కారణంగా గత కొంత కాలంగా చైనా, భారత్ల మధ్య తీవ్ర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. డోక్లాం నుండి భారత్ తక్షణం వెనక్కి వెళ్లడమే పరిష్కారమంటూ ప్రచురించిన ఆ పత్రిక, ఇండియా సైనికులు ఆ ప్రాంతం నుండి తిరిగి వెళ్లకపోతే త్వరలోనే తాము అల్టిమేటం జారీ చేస్తామని, చర్యలు తీసుకుంటామని తమ దేశ రక్షణదళ మాజీ అధికారి ఒకరు చెప్పినట్లు పేర్కొంది. భారత్ కనుక అల్టిమేటంను పక్కన పెడితే, భారత సైన్యాన్ని డోక్లాం నుండి పంపించడానికి తమకు చాలా మార్గాలు ఉన్నాయి అని తెలిపింది. ఈ నేపధ్యంలో బ్రిక్స్ దేశాల ఆర్థిక అభివృద్దికి అడ్డుగా ఈ సమస్య మారకూడదని హితవు పలికింది. ఎయిర్ బేసెస్ లాంటి కొత్త ఆయుధాలు మా దగ్గర ఉన్నాయంటూ భారత్కు హెచ్చరికలు జారీ చేసింది.