ముచ్చెమటలు పట్టిస్తున్న భానుడు

SMTV Desk 2019-04-17 14:22:40  summer, adilabad

ఆదిలాబాద్: ఆదిలాబాద్ లో చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, వేసవికాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉండడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా వేసవిలో ఉత్తర భారతదేశం నుంచి వీచే వేడిగాలులతో జిల్లాలో రికార్డుస్థాయి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందువల్లే ఈ సారి కూడా సూర్యుడు సెగలు గక్కుతున్నాడు. ఏప్రిల్ నెలలోనే భానుడు నిప్పులవర్షం కురిపిస్తూ భయపెడుతున్నాడు. ప్రతీ ఏటా నమోదవుతున్న టెంపరేచర్ కంటే ఈసారి 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఓ మాదిరిగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 40 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది. ఏప్రిల్ లోనే ఈ స్థాయి టెంపటేచర్ ఉంటే.. మేలో ఉష్ణోగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట ఎవ్వరూ బయటకు రావడం లేదు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.