`మా`ఎన్నికల వేళ శివాజీరాజా ప్యానెల్కు, నరేష్ ప్యానల్కు మధ్య జరిగిన రచ్చ స్థానికి ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ జరిగి వుండదు. ఆ స్థాయిలో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసి అనూహ్యంగా నరేష్ ప్యానెల్ విజయాన్ని సాధించింది. `మా` అధ్యక్షుడిగా వీకే నరేష్ ఎన్నికయ్యారు. గెలవగానే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ప్రమాణ స్వీకారం కోసం పెద్ద రచ్చ చేసిన నరేష్ అంతా అనుమానించినట్టుగానే వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు.
ఎన్నికలు జరిగిన తరువాత `మా` అకౌంట్లో వుండాల్సిన 7 లక్షలకు సమాధానం చెప్పాలని నరేష్ని మాజీ `మా` అధ్యక్షుడు శివాజీరాజా ఎంతగా ప్రెస్ మీట్లు పెట్టి అడిగినా నరేష్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే ఆ ఏడు లక్షలు `మా` అకౌంట్లో లేవని తేలింది. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా నరేష్ ఇచ్చిన పంచ్కు అవాక్కయ్యారు. `మా` అకౌంట్లో వుండాల్సిన 7 లక్షలు డా. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని అకౌంట్లోకి వెళ్లిపోయినట్లు తెలడంతో `మా`లో మళ్లీ ముసలం మొదలైంది. ప్రమాణం స్వీకారం చేసి పట్టుమని నెల కూడా కాకముందు నరేష్ ఇచ్చిన పంచ్కి `మా` సభ్యులకు, అతన్ని గెలిపించిన వారికి కళ్లు బైర్లు కమ్మాయని మాట్లాడుకుంటున్నారట.
ఆ రూ.7 లక్షలు శివాని అకౌంట్లోకి వెళ్లడానికి ఓ కారణం వుందట. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవాలన్న ఉద్దేశంలో కొన్ని ప్రకటనల్ని నరేష్ అండ్ కో గుప్పించారు. దానికి అక్షరాలా 7 లక్షలు ఖర్చయ్యాయి. ముందు శివాని డబ్బుల్ని ఇందుకు వాడుకున్న `మా` అధ్యక్షుడు నరేష్ ఆ తరువాత `మా`లో వున్న 7 లక్షలని శివాని అకౌంట్కి బదిలీ చేశారట. ఇక్కడే నరేష్ అడ్డంగా బుక్కయ్యాడని, ఇదే శివాజీ రాజాకు బ్రహ్మాస్త్రంగా మారబోతోందని మిగతా వర్గం బాహాటంగాఏ చెబుతున్నారు. నరేష్ అత్యుత్సాహమే అనర్థానికి కారణమైందని, సభ్యులకు వాడాల్సిన సొమ్మును ప్రకటనల కోసం వాడేశారని అంతా నరేష్పై మండిపడుతున్నారు. పేనుకు పెత్తనమిస్తే అంటూ సామెతలు చెప్పుకోవడం చర్చకొచ్చింది.