హైదరాబాద్, ఆగస్ట్ 17 : ఇటీవల డ్రగ్స్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖులను విచారించిన సిట్ అధికారులు విచారణను మరింత వేగం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగరంలోని పలు పబ్బులు విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతున్నాయని గుర్తించిన సిట్ అధికారులు గతంలోనే కొన్ని పబ్ లను విచారణకు పిలిచి, హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా సీసీ కెమెరాలు పెట్టని పబ్బులు, ఒకవేళ పెట్టినా ఆఫ్ చేసే ప్రతి పబ్బుకు నోటీసులు జారీ చేసారు. అంతేకాకుండా వారం రోజుల్లోగా అసలు కెమెరాలు ఎందుకు పని చేయకుండాపోయాయో, వాటికి ఎందుకు పవర్ కట్ చేశారో? వివరణ ఇవ్వాల్సిందిగా 16 పబ్బులను సిట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ జాబితాలో జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి పరిధులలో ఉన్నాయి. ఓవర్ ద మూన్, క్లబ్ ఎక్స్ త్రీ, హైడ్రోజన్, ట్రియో ఎఫ్ క్లబ్, ఆక్వా కిస్మత్, ఓటీఎం, క్లబ్ ఆర్, హై లైఫ్, బీటీఎం ఎయిర్ లైన్ తదితర పబ్ లకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా కొన్ని పబ్బులకు లైసెన్సులు కూడా రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.