నంద్యాల, ఆగస్ట్ 17 : నంద్యాల ఉప ఎన్నికల్లో హీరో బాలకృష్ణతో కలిసి మంత్రి అఖిల ప్రియ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో భూమా నాగిరెడ్డి కుటుంబానికి ప్రత్యర్థి వర్గమైన గంగుల కుటుంబంలోని కీలక నేత ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి టీడీపీలో చేరనున్నారని వచ్చిన వార్తలతో అఖిల ప్రియ చిన్న బుచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. భూమా, గంగుల వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే, కనీసం తనకు మాట మాత్రమైన చెప్పకుండా ప్రతాప్ రెడ్డిని ఎలా చేర్చుకుంటారని ఆమె ప్రశ్నించినట్లుగా సమాచారం. అంతేకాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ ను ప్రతాప్ కే ఇవ్వనున్నట్లు సీఎం హామీ ఇచ్చినట్లు ఉహాగానాలు రావడంతో భూమా వర్గం ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కాగా అఖిల ప్రియ ప్రచారం మధ్యలోనే వెళ్ళిపోయి తన అనుచరులతో భేటీ అయినట్లుగా సమాచారం.