RCBకి నేడు DO or DIE మ్యాచ్

SMTV Desk 2019-04-14 11:20:09  RCB, IPL 2019, VIRAT KOHLI, RCB VS KXIP

ఐపీఎల్ 2019 సీజన్‌లో ఒక్క గెలుపు కూడా లేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఈరోజు ఆఖరి అవకాశం. వరుస ఓటములతో బోణి కోసం ఎదురుచూస్తున్న ఈ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈరోజు మ్యాచ్‌లో తప్పక‌ గెలవాల్సి ఉంది. ఇప్పటికే వరుసగా ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కోహ్లీసేన.. ఈరోజు రాత్రి 8 గంటలకి మొహాలి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఢీకొట్టబోతోంది. చావోరేవో మ్యాచ్ కావడంతో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తడబడుతూ వస్తోంది. మధ్యలో ఓ రెండు మూడు మ్యాచ్‌ల్లో కోహ్లి, డివిలియర్స్, పార్థీవ్ పటేల్ మెరిసినా.. మిగిలిన వారి నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన లేదు. ఇక బౌలింగ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనే తరహాలో.. ఆ జట్టు బౌలర్లు ప్రదర్శన ఉంది. చాహల్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నా.. ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, నవదీప్ షైనీ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో బౌలర్ల మార్పులతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ మార్పులు చేయాలని కెప్టెన్ కోహ్లీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ జట్టులో హిట్టర్లు ఉండటంతో.. భారీ స్కోరు ఛేదించాల్సి వచ్చినా.. లేదా తొలుతే బ్యాటింగ్ చేసినా.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని బెంగుళూరు యోచిస్తున్నట్లు సమాచారం.