వాషింగ్టన్: భారత్ తాజాగా అంతరిక్షంలో నిర్వహించిన ఏ-శాట్ ప్రయోగానికి అమెరికా రక్షణ శాఖ మద్దతు తెలిపింది. మార్చి 27వ తేదీన దిగువ కక్ష్యలో ఉన్న ఓ ఉపగ్రహాన్ని భారత్ పేల్చింది. ఉపరితలం నుంచి గగనతలంలోని టార్గెట్లను చేధించే మిస్సైల్ తో దాన్ని పేల్చారు. దీంతో యాంటీ శాటిలైట్ మిస్సైల్ కలిగిన 4వ దేశంగా భారత్ నిలిచింది. ఈ పరీక్షపై నాసా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తాజాగా అమెరికా రక్షణశాఖ స్పందించింది. అంతరిక్ష ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలోనే భారత్ ఆ పరీక్ష నిర్వహించినట్లు యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్ కమాండర్ జనరల్ జాన్ హైటన్ తెలిపారు. భారత్ తనను తాను కాపాడుకునేందుకు సత్తా ఉందని నిరూపించేందుకు ఆ పరీక్ష చేపట్టారని ఆయన అన్నారు.