లక్నో: ఉత్తరప్రదేశ్ లో ముగ్గురు మహిళలు డ్యూటిలో ఉన్న ఓ మహిళా అధికారిణిని చితకబాదిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల ప్రకారం... రీతా కుమారి అనే పోలీస్ అధికారిణి మంగళవారం సీతాపూర్ జిల్లా హాస్పిటల్లో డ్యూటీ చేస్తుంది. అప్పుడు హాస్పిటల్కు వచ్చిన ముగ్గురు మహిళలు లైన్లో వెళ్లకుండా.. అందరికంటే ముందే వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రీతా కుమారి వారిని అడ్డుకుంది. దీంతో కోపోద్రిక్తులైన ఆ ముగ్గురు మహిళలు రీతా కుమారితో గొడవకు దిగి ఆమెపై చెయ్ చేసుకున్నారు. తమకు ఈ ఘటనపై వచ్చిన రిపోర్టు ఆధారంగా ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని.. వారిపై కేసు నమోదు చేశామని సీతాపూర్ సర్కిల్ ఆఫీసర్ యోగేంద్రసింగ్ తెలిపారు. మహిళలు పోలీసును కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.