ఐసిసి ప్రపంచ కప్ 2019 మే 30న ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న సందర్భంగా ఐసిసితో పాటు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ లో మ్యాచ్ లను విక్షీంచేందుకు మైదానాలకు వచ్చే క్రికెట్ అభిమానులకు చల్లని కబురు చెప్పింది. క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకులకు తక్కువ ధరకే బీర్లు అందించనున్నారు. ఈ మేరకు ప్రపంచకప్ అధికారిక బీర్ స్పాన్సర్గా భారత్కు చెందిన ‘బీరా 91’ కంపెనీతో ఐసిసి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచకప్ మ్యాచ్లు జరిగే 11 వేదికల్లో ఇదే బీరును విక్రయించనున్నారు. నిర్వాహకులు ఒక బీరు పింట్(గ్లాసు) ధరను 9.70 డాలర్లు(సుమారు రూ.670)గా నిర్ణయించారు. అయితే, ఒక బీరు పింట్ ధర కనీసం 15.5 డాలర్లు (సుమారు రూ.1000) ఉంటే గాని తమకు గిట్టుబాటు కాదని అక్కడి వ్యాపారులు అన్నారట. దీంతో ఐసిసి ఓ ఉపాయం ఆలోచించింది. ప్రేక్షకులకు తక్కువ ధరకే ఇవ్వండి, మిగిలిన నష్టాన్ని మేం పూరిస్తాం అని ఐసిసి అధికారులు హామీ ఇచ్చారట. దీంతో ఐసిసిపై మొత్తం దాదాపు 5 లక్షల పౌండ్ల(రూ. 4 కోట్ల 52 లక్షలు) భారం పడనుంది.