అమరావతి: రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలకు హైదరాబాద్ లోని ఏపీ ప్రజలు తమ సొంత ఊళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో వీరికి ప్రముఖ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ కావేరీ ట్రావెల్స్ షాక్ ఇచ్చింది. రద్దీ ఎక్కువ ఉండడంతో దాదాపు అందరూ ప్రైవేట్ బస్సులనే నమ్ముకుంటారు. అయితే కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం చివరి క్షణంలో దాదాపు 125 బస్సులను రద్దు చేసి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. ఇతర ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా కొన్ని బస్సులను రద్దుచేశాయి. సరిపడా డ్రైవర్లు లేనందున, సంస్థల్లోని ఇతరత్రా అంతర్గత కారణాల వలన యాజమాన్యాల బస్సులను రద్దుచేసినట్టు తెలుస్తోంది. దీంతో దాదాపు 200 వరకు బస్సులు నిలిచిపోయాయి. చివరి క్షణంలో ఇలా సర్వీసులు రద్దయ్యాయంటూ యాజమాన్యాలు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన ఓటర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.