ముంభై: ఈ మధ్యే బిజెపి కండువా కప్పుకున్న ప్రముఖ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇతర పార్టీ నేతలపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. రాజకీయం అంటేనే అదికదా. వారి మీద వీరు, వీరిపై వారి విమర్శలు. అయితే ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ను ట్విట్టర్లో బ్లాక్ చేసారు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి, ఆర్టికల్ 370 తదితర అంశాలపై ట్వట్టర్ వేదికగా సాగిన వాడివేడి చర్చ తరువాత.. మెహబూబా, గౌతమ్ గంభీర్ను బ్లాక్ చేయడం చర్చనీయాంశమైంది. ఫరూక్ అబ్ధుల్లా, ఒమర్ అబ్దుల్లాలతో పాటు పలువురు నేతలను బహిష్కరించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు కాగా, ఇది బీజేపీ ప్రోద్బలంతో వేసిందేనని ముఫ్తీ విమర్శలు చేశారు. ఇది కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని, భారత రాజ్యాంగం జమ్మూకశ్మీర్ ప్రాంతానికి వర్తించదని ఆమె తెలిపారు. ఈ పరిణామలపై గంభీర్ స్పందిస్తూ, ఇది భారతదేశమని, మీ వంటి వారు మాత్రమే అటువంటి వాటిని చెరిపివేయగలరని ఎద్దేవా చేశారు. దీనిపై ముఫ్తీ స్పందిస్తూ, మీ బీజేపీ రాజకీయ ఇన్నింగ్స్లో ఇంతకన్నా ఏమీ మాట్లాడలేరంటూ ఆయన్ను బ్లాక్ చేశారు.