సత్తెనపల్లి: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్షో చంద్రబాబు మాట్లాడుతూ.... కేసిఆర్, మోది, కోడికత్తిపార్టీ మూడు కలిసి ఏపిపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే మాకు కావాలని పట్టుబట్టిన కేసిఆర్, ఇప్పుడు ఏపి ప్రత్యేక హోదాకు మద్దతిస్తానంటున్నారని ధ్వజమెత్తారు. అలాగే వంద మంది మోదీలు వచ్చినా తననేమీ చేయలేరని, తన జోలికొస్తే ఎవ్వర్నీ, వదిలిపెట్టబోనని హెచ్చరించారు. మోదికి ఓటేస్తే ముస్లింలకు భద్రత ఉండబోదని, ఇప్పటికే అసోంలో బర్మా ముస్లింలంటూ లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. జగన్ ఒక్క అవకాశం ఇమ్మని కోరుతున్నారు. ఆయన వస్తే పోలవరం ఆగిపోతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కేసిఆర్ చేతిలోకి వెళ్లిపోతాయి. కేసుల మాఫీ కోసం కేసిఆర్, మోది చెప్పినట్లు జగన్ ఆడతాడు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా లొంగవద్దని సియం ప్రజలకు సూచించారు.