లక్నో: ఆదివారం ఉత్తరప్రదేశ్ షహరాన్పూర్లోని డియోబాండ్లో… సమాజ్వాదీ పార్టీ (ఎస్పి), బిఎస్పి, రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డి) కూటమి నిర్వహించిన ర్యాలీలో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) అధినేత్రి మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి ఓటమి తప్పదని, ద్వేషాన్ని ప్రేరేపించే విధానాలవల్లే అది ఓడిపోవలసి వస్తుందని అన్నారు. అలాగే తప్పుడు విధానాలవల్లే ఆ పార్టీ అధికారానికి దూరమైందని అన్నారు. ‘తను ఇచ్చిన హామీల్లో పావు వంతు కూడా ప్రధాని మోడీ నెరవేర్చలేదు. ప్రజల్ని తప్పుదారి పట్టించడం, ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు బిజెపికి తోడ్పడవు. ప్రచారం కోసం వేలాది కోట్లు ఖర్చు చేసిన ఆ పార్టీ ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఉంటే బాగుండేది. వాళ్లు నిజంగా తలచుకుంటే ఎన్నికల ప్రకటనకు ముందే ప్రాజెక్టులు పూర్తయి ఉండేవి. వాళ్లు మీ ఓటుకోసం రకరకాల ఎత్తులు వేస్తారు. జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె ఓటర్లను హెచ్చరించారు. కేంద్రంలో నరేంద్రమోడీతో పాటు, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను గద్దె దించాలని మాయావతి పిలుపునిచ్చారు.