ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల సమయం సమీపించడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాటి మిత్రులని కూడా చూడకుండా ఈ మధ్యనే వైసీపీ తీర్థం పుచ్చుకున్న సినీనటుడు అలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ తనకు మిత్రుడైనా వైసీపీ అధ్యక్షుడు జగన్తో చేతులు కలిపారని ఆగ్రహించారు. అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్ ఇచ్చినా తనను వదిలి వెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నానని.. తనతో కలిసి పనిచేస్తానన్న అలీ చెప్పకుండానే వైసీపీలోకి వెళ్లారని తెలిపారు. అలీ లాంటివాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని కూడా వివరించారు.
అదేవిధంగా తాను ఎన్నికల్లో రాణించలేనని ఎలా అనుకుంటారని, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమాతో స్టార్ అవుతానని ఎవరైనా అనుకున్నారా అంటూ పవన్ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా అవసరానికి ఆదుకున్న మిత్రుణ్ని వదిలేస్తే ఇక తాను ఎవరిని నమ్మాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.