నంద్యాల, ఆగస్ట్ 16: నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలిచిన వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి తెదేపా నుంచి వైసీపీకి మారడమే కాకుండా, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన మంత్రి భూమా అఖిల ప్రియకు సవాల్ విసిరారు. తన అన్న కోసం తను రాజీనామా చేసి ఓట్లు అడుగుతున్నానని, దమ్ముంటే భూమా అఖిలప్రియ కూడా అలా చేయాలని ఆయన సవాల్ చేశారు. వైకాపా జెండాతో గెలిచి, టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలంతా, ధైర్యముంటే రాజీనామాలు చేసి, వాటిని ఆమోదింపజేసుకోవాలని డిమాండ్ చేసిన శిల్పా, తెలుగుదేశం నాయకులు చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు తన రాజీనామాతో సరైన సమాధానం చెప్పానని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఉపఎన్నికల్లో తన అన్న శిల్పా మోహన్ రెడ్డికే విజయం వరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.