అమరావతి: మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ...చంద్రబాబునే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు . రాష్ట్ర అభివృద్ధిలో రాజీ పడకుండా చంద్రబాబు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే.. అమరావతికి వచ్చిన దేవెగౌడ.. అభివృద్ధి కోసం ప్రజలు చంద్రబాబుకు మద్దతివ్వాలని కోరారు వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. పేపర్ బ్యాలెట్ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని దేవెగౌడ ఆరోపించారు. దేశంలోని వ్యవస్థలన్నింటినీ మోదీ నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి బలంగా ఉందన్నారు. ప్రత్యర్థులపైకి 300 మంది ఐటీ అధికారుల్ని ఉసిగొల్పారని ఆరోపించిన ఆయన.. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందన్నారు.