దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. తొలి విడత ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు ప్రజల నాడిని పసిగట్టేందుకు సర్వేలు నిర్వహించి వారి అంచలనాలను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ, తొలి దశ ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించింది.
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇతరులు 2 చోట్ల గెలుస్తారని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు వైస్సార్సీపీ పార్టీ 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. అలాగే 39 లోక్సభ స్థానాలున్న తమిళనాడులో డీఎంకే 25 చోట్ల విజయం సాధిస్తుందని, 21 స్థానాలున్న ఒడిశాలో బిజూ జనతాదళ్ 16 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు 30 సీట్ల వరకూ రావచ్చని పేర్కొంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని తెలిపింది.