చంద్రబాబు ఒక మూర్ఖుడు

SMTV Desk 2019-04-09 11:44:13  Mohan babu, Chandrababu

ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగనే పక్కా గెలుస్తారు.. ఆయన సీఎం అవడం ఖాయం అని అన్నారు సీనియర్ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు. చంద్రబాబు లాంటి నీచుడిని తన జీవితంలో చూడలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆరోపించారు. పదేళ్లు ప్రజా సమస్యలపై పోరాడుతూ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశాడని.. వైఎస్ఆర్ ఆశయాల కోసం పోరాడుతున్నాడని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ గెలిచి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

‘అసలు టీడీపీ చంద్రబాబుది కాదు.. ఎన్టీఆర్ నుంచి లాక్కున్నాడు. ఒకప్పుడు చంద్రబాబును నమ్మినందుకు తన మీద కూడా చెప్పులు పడ్డాయి.. ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఎన్టీఆర్‌ను కలిశాను. రాష్ట్రంలో ఇసుక, మట్టి దోచుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. చంద్రబాబు అంత అవినీతిపరుడు ఈ ప్రపంచంలోనే ఇంకొకరు లేరు. చంద్రబాబు అంత ఆస్తి ఎలా సంపాదించారో ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు ఒక మూర్ఖుడు. అతని స్థాయి ఏంటి ? ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌కు భయపడే చంద్రబాబు హైదరాబాద్ వదిలి పారిపోయి వచ్చాడు. విదేశాల్లో ఉండే తెలుగువారి మధ్య కూడా చంద్రబాబు కులాల చిచ్చు పెట్టాడు’ అని ఆరోపించారు మోహన్ బాబు.

తాను, కేసీఆర్, జగన్ కలిసి కుట్రలు పన్నుతున్నామని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతీ మాట అబద్దమేనని విరుచుకుపడ్డారు. తాను ఏ పదవులు ఆశించి వైసీపీలో చేరలేదని.. వైఎస్ కుటుంబానికి, మంచు ఫ్యామిలీకి బంధుత్వం ఉందని గుర్తుచేశారు