న్యూఢిల్లీ : బీజేపీ పార్టీకి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో స్వరపరిచిన బీజేపీ థీమ్ సాంగ్ను ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈ పాటను ఎక్కడా ప్లే చేయకూడదని ఆదేశించింది. ఈ గీతానికి సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. ప్రచార గీతానికి సంబంధించి వారు ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదు. అలాగే ఈ పాటను ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగిస్తున్నారు. అందుకే దీన్ని నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చామని ఎన్నికల అధికారి సంజయ్ బసు తెలిపారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. బెంగాల్లోని ఆసన్సోల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుప్రియో కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అయితే ఈ థీమ్ సాంగ్కు సంబంధించి కొన్ని రోజుల క్రితం తృణమూల్ కాంగ్రెస్ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే సామాజిక మాధ్యమాల్లో గీతాన్ని విడుదల చేశారని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. బాబుల్ సుప్రియోకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనంతరం ప్రచార గీతానికి సంబంధించిన వివరాలను బీజేపీ ఈసీకి సమర్పించింది. అయితే ఈ గీతానికి సంబంధించి తరవాత చేసిన మార్పులను కూడా ఎన్నికల సంఘం కోరింది. ఇప్పటికీ దానిపై బీజేపీ స్పందించక పోవడంతో ఈ థీమ్ సాంగ్ను నిలిపివేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.