జగన్‌ కు మొదటి శత్రువు విజయసాయిరెడ్డే

SMTV Desk 2019-04-08 17:30:52  Shivaji, jagan, Vijay sai reddy

నేడు సంచలన విషయాలు వెల్లడించబోతున్నానంటూ నిన్ననే ప్రకటించిన నటుడు శివాజీ అనుకున్నట్టే మీడియా ముందుకు వచ్చారు. మీడియా అనుకున్నదానింటే ఎక్కువ ట్విస్టే ఉంటుందన్న శివాజీ ముఖ్యంగా రెండు విషయాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించానని పేర్కొన్నారు. తన బాధంతా ప్రజల కోసమేనన్న శివాజీ.. ఏదైనా విషయం ఉంటే తప్ప తాను మీడియా ముందుకు రానని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వంపై, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారంలో నిజమెంత ఉందో బయటపెట్టేందుకే మీడియా ముందుకు వచ్చానన్న శివాజీ.. పోలవరంలో ఒక్క ఇటుక కూడా పడలేదన్న వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. చెప్పేదానికంటే కళ్లతో చూస్తేనే నిజాన్ని నమ్ముతారన్న ఉద్దేశంతో పోలవరంలో ఏం జరుగుతోందో స్వయంగా అక్కడికి వెళ్లి తెలుసుకున్నానంటూ ‘ది ట్రూత్’ పేరుతో తీసిన వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోకుంటే కేసీఆర్ దీనిని ఆపివేయడం ఖాయమని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని, కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపి తీరుతారని స్పష్టం చేశారు. తనకు అనుకూలంగా వచ్చే వారి కోసం కేసీఆర్ ఎంతైనా ఖర్చు చేస్తారని, ఈ మహాయజ్ఞంలో కేసీఆర్ నీళ్లు పోస్తారని సంచలన ఆరోపణలు చేశారు. పక్కరాష్ట్రంలోని కొంతమంది సన్నాసులు ఏపీపై పగబట్టారని వారి ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. వారి కుట్రలను బద్దలుగొట్టకపోతే మీ కుటుంబాలకు అన్యాయం చేసుకున్నవారు అవుతారని శివాజీ హెచ్చరించారు. రాబోయే తరాలకు అన్యాయం చేసిన వారు అవుతారని ఆ దారుణాన్ని ఆపాలని, సరైన నేతను ఎంచుకోవాలని శివాజీ పిలుపునిచ్చారు. ఇక జగన్‌ కు మొదటి శత్రువు విజయసాయిరెడ్డేనని ఈ సందర్భంగా శివాజీ అన్నారు. ఆయన ట్వీట్లు చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు.