న్యూఢిల్లీ : ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. ఈరోజు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. సొంతగడ్డ ఉప్పల్లో వరుసగా రెండు విజయాలతో మంచి ఊపుమీదున్న హైదరాబాద్ జట్టు ఆటగాళ్లను ఈరోజు మ్యాచ్లో వారిని నిలువరించడం ఢిల్లీ బౌలర్లకి సవాలే. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తాజా సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్నా... మిడిలార్డర్ మాత్రం ఇంకా టచ్లోకి రావాల్సి ఉంది. విజయ్ శంకర్ మెరుపులు మెరిపిస్తున్నా.. భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ఇక మనీశ్ పాండే, యూసఫ్ పఠాన్, దీపక్ హుడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. మరోవైపు బౌలింగ్లో రషీద్ ఖాన్, నబీ మెరుస్తున్నా.. భువనేశ్వర్ కుమార్ తేలిపోతున్నాడు. సందీప్ శర్మ, సిద్ధార్థ కౌల్ లయ అందుకోవాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యువ, సీనియర్ ఆటగాళ్లతో సమతూకంగా కనిపిస్తోంది. కానీ.. అనుభవలేమీ ఆ జట్టుని వరుస మ్యాచ్ల్లో దెబ్బతీస్తోంది. ఎంతలా అంటే.. పంజాబ్పై ఛేదనలో సులువుగా గెలిచే మ్యాచ్ను ఆఖర్లో కేవలం 15 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు చేజార్చుకుని ఢిల్లీ జారవిడించింది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నిలకడగా ఆడుతున్నా.. గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. అతను గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఆడి ఉండటం.. ఈ మ్యాచ్లో ఢిల్లీకి కలిసొచ్చే అంశం. ఇక హిట్టర్ రిషబ్ పంత్.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో తన వికెట్ విలువ తెలుసుకోలేకపోతున్నాడు. శ్రేయాస్ అయ్యర్, ఇంగ్రామ్ పరిస్థితి కూడా అలానే ఉంది.