హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

SMTV Desk 2019-04-04 18:18:29  Hyderabad metro card,

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఉగాది పండుగ సందర్భంగా శుభవార్త అందించింది ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ. మెట్రోరైలులో రాకపోకలు సాగించే వారికి ఉగాది కానుక స్మార్ట్ కార్డు ధరను భారీగా తగ్గించింది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకే ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటివరకు రూ.150కి స్మార్ట్ కార్డు లభించేది. ఈ మొత్తంలో రూ.20 తిరిగి చెల్లించరు. మిగతా మొత్తం ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డును ఇప్పుడు రూ.75కే అందుబాటులోకి తీసుకొని వచ్చింది. మూడు నెలల వరకు ఈ ధరే ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఇందులో రూ.50 వరకు ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. నగదు అయిపోగానే కనీసం రూ.50, గరిష్ఠంగా 3వేల వరకు రీఛార్జ్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఇప్పటివరకు 6 లక్షలపైగా స్మార్ట్ కార్డులను మెట్రో విక్రయించింది. నిత్యం ప్రయాణించే 2.20 లక్షల మందిలో 1.50 లక్షల మంది వరకు వినియోగిస్తున్నారు. ధర తగ్గించడంతో వీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.