యోగి ఆదిత్యనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2019-04-04 17:01:34  CM adityanath,

ఎల్లపుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కాడు. ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో కేంద్రమంత్రి వి.కె.సింగ్‌ తరపున ప్రచారం చేస్తున్న సమయంలో ‘ఉగ్రవాదులకు కాంగ్రెస్‌ పార్టీ బిర్యానీ పెట్టి పోషిస్తే, మోదీ సేన (ఆర్మీని ఉద్దేశించి) వారికి బాంబులు, బుల్లెట్లతో సమాధానం చెబుతోంది’ అని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించాడు. భారత సైన్యాన్ని ‘మోదీ సేన (మోదీజీ కీ సేనా)’గా అభివర్ణిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈసీ తీవ్రంగా స్పందించింది.

ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ‘మన సైన్యాన్ని అవమానపరిచారని.. ఆర్మీ బీజేపీ సొత్తు కాదని, దేశానికి గొప్ప ఆస్తి’ అంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇండియన్ నేవి మాజీ అధిపతి అడ్మిరల్ రాందాస్ ఈసీకి లేఖ రాస్తూ ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొన్నారు. విమర్శలు వెల్లువెత్తడంతో దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అందించిన నివేదికలోని వీడియో క్లిప్పింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల సంఘం ఆదిత్యనాథ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో శుక్రవారం నాటికి ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.