హైదరాబాద్, ఆగస్ట్ 15: నేడు యావత్ భారత దేశం 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోట వేదికగా ఈ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... ఇటీవల సంచలనం రేకెత్తించిన డ్రగ్స్ కేసుపై స్పందిస్తూ సినీ ప్రముఖులైనా, రాజకీయ నాయకులైనా, వ్యాపారులైనా మత్తుమందుల వాడకంలో నేరం రుజువైతే చట్టం ముందు ఒకటేనని, కేసులో ఇరుక్కున్న ఏ ఒక్క ప్రముఖుడినీ వదిలేది లేదని ఆయన తెలిపారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే నా కల, దాన్ని సాఫల్యం చేసేందుకు ప్రభుత్వ అధికారులంతా కలిసి రావాలని ఆయన విన్నవించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరా పొలానికీ నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని, వచ్చే సంవత్సరం నుంచి రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ప్రతీ రైతుకు ఎకరానికి 8 వేల రూపాయల చొప్పున అందజేస్తామని తెలియజేశారయన. ఇటీవలే ప్రారంభించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం ప్రాజెక్టు గురించి గుర్తు చేశారు.