తిరుపతి, ఆగస్ట్ 15: తిరుపతిలోని తారకరామ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం వాహనంమపై గౌరవ అతిథి స్థానంలో నిల్చుని మైదానంలో ప్రయాణించి పరేడ్ను పరిశీలించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజలకు అభివాదం చేశారు. తరువాత ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ... ఆనాటి పోరాట యోదుల స్మరణ మనకు చైతన్యమని ఆయన తెలిపారు. దేశం మొత్తాన్ని ఒకే బాటలోకి తీసుకువచ్చిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అల్లూరి సీతారామరాజు పేరు తలచుకుంటే ఇప్పటికీ ఉద్యమానికి కావల్సిన పౌరుషం తన్నుకు వస్తుందని అన్నారు. కాగా, స్వాతంత్ర్య సమరయోథుల కుటుంబాలను గౌరవించడం మనందరి బాధ్యత, ఇప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం సమరయోథులకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్ ను రూ.15 వేలు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు.