ఎన్నికల ముందు రాహుల్ కి ఎదురు దెబ్బ

SMTV Desk 2019-04-04 16:07:27  Rahul gandhi, seetharam echuri

థానే : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరిలకు థానే కోర్టు నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలపై ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త వివేక్‌ చంపనేర్కర్‌ వీరిపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 30వ తేదీన కోర్టుకు హాజరుకావాలని రాహుల్‌, ఏచూరిలను కోర్టు ఆదేశించింది.

గౌరీ లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్‌కు ముడిపెట్టడం ద్వారా సంస్థ ప్రతిష్ఠకు రాహుల్, ఏచూరి భంగం కలిగించారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. 2017 సెప్టెంబర్ 5వ తేదీన గౌరీ లంకేష్ తన నివాసం వెలుపల హత్యకు గురయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఒత్తిళ్లు తేవడం, దాడులు, చివరకు చంపడానికి కూడా వెనుకాడటం లేదని అప్పట్లో రాహుల్ వ్యాఖ్యానించగా, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ, ఆర్ఎస్‌ఎస్ వ్యక్తుల వల్లే లంకేష్ హత్య చోటుచేసుకుందని ఏచూరి విమర్శించారు.