సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలతో నిఘావ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా మారుమూల గ్రామాల్లో, సున్నితమైన ప్రాంతాల్లో పోలింగ్ విధానం, ఏర్పాట్లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎన్నికల అధికారులు వీక్షించే వీలు కలుగుతుంది. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ఉపయోగపడే ఈ వెబ్కాస్టింగ్ విధానానికి కంప్యూటర్పై అవగాహన ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను వినియోగించుకోనున్నారు.
దీనికోసం ఇప్పటికే 1400 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నిర్మల్ జిల్లాకు 900 మంది, నిజామాబాద్ జిల్లాకు 300 మంది, ఆదిలాబాద్ జిల్లాకు 200 మంది విద్యార్థులు వెబ్కాస్టింగ్ విధులకు వెళ్లనున్నారు. మంచిర్యాల, కామారెడ్డి తదితర జిల్లాల్లో పాల్గొనేందుకు మరికొంత మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీరందరికి ఆదివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.