తణుకు : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వైసీపీ, టీడీపీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని, తప్పుడు ప్రచారాలు చేస్తే ఉభయగోదావరి జిల్లాల టిడిపి నేతలకు మర్యాద దక్కదని పవన్ హెచ్చరించారు. ఐనా సైకిల్ చైన్ ఎప్పుడో తెంపేశామని, ఐనా ఆ పార్టీ నేతలు ప్రచారాలు చేయడంలో అర్ధం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నారని, అందుకే చంద్రబాబు పెన్షన్ ఇచ్చి రాజకీయాల నుంచి రిటైర్ కావాలని సూచించారు. తాను సుదీర్ఘ ప్రణాళికతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఎన్నికలతోనే అంతా అయిపోతుందని భావించడంలేదని పవన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల తర్వాత జైలుకు వెళ్లడానికి తనపై జగన్లా అక్రమాస్తుల కేసులు లేవని, చంద్రబాబులా ఓటుకు నోటు కేసు లేదని సెటైర్ వేశారు.