ముంభై : సోమవారం దేశీ స్టాక్ మార్కెట్ జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకింది. కాని సూచీలు చివరకు ఆ స్థాయిల్లో నిలవలేకపోయాయి. అయినప్పటికీ సెన్సెక్స్ 199 పాయింట్ల లాభంతో 38,872 పాయింట్ల వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 11,656 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఒకానొక దశలో 39,116 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఇది ఆల్టైమ్ గరిష్ట స్థాయి. ఇక నిఫ్టీ 11,644-11,738 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. వడ్డీ రేట్లలో పావు శాతం కోత ఉండొచ్చనే అంచనాలు, దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువలా కొనుసాగుతుండటం వంటి అంశాలు సూచీల ర్యాలీకి సహకరిస్తున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్ఎస్ఈలోని బ్యాంక్ నిఫ్టీ 30,648.10 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది.