ఒకవైపు సార్వత్రిక ఎన్నికల కోలాహలం.. మరోవైపు ఐపీఎల్ జోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ అజింక్యా రహానేకు జరిమానా పడింది. ఆదివారం రోజున చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా రహానేకు రూ.12 లక్షలు మ్యాచ్ ఫీజు కోత విధించినట్లు ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.
రాత్రి సమయం కావడంలో మంచు ఎక్కువగా కురిసింది. ఈ కారణంగా రాజస్థాన్ బౌలర్లు బంతిపై పట్టు తెచ్చుకునేందుకు పదేపదే రుద్దడం వల్ల రెండో ఇన్నింగ్స్ ఆలస్యమైంది. ఈ మ్యాచ్లో ధోనీ 75 (46బంతుల్లో 4సిక్సర్లు, 4ఫోర్లు) పరుగులతో రాణించాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ శనివారం నాడు జరిగిన మ్యాచులో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించిన విషయం తెలిసిందే.