మా మొదటి నిర్ణయం ఏపీకి ప్రత్యేక హోదా

SMTV Desk 2019-03-31 17:46:16  Rahul gandhi,

ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ప్రకటిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం కాదని.. రాష్ట్రంతో తమకు ఉన్న ఆత్మీయ బంధానికి గుర్తుగా ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఏపీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ విజయవాడలో బహిరంగ సభలో మాట్లాడారు. ఏపీ ప్రజలకు మాటిచ్చామని.. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచామని ఆయన వివరించారు. ఏపీని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీసుకు రావడమే తమ లక్ష్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మోడీలా తాము మాట తప్పబోమని రాహుల్ గాంధీ వివరించారు.

అదేవిధంగా దేశంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించే విధంగా మోడీ నిర్ణయాలు తీసుకున్నారని.. నోట్ల రద్దు, జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థలను మోడీ పూర్తిగా దెబ్బ తీశారని విమర్శించారు. నీరన్ మోడీ, విజయ్ మాల్యా, అనీల్ అంబానీలు మోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల లాభపడ్డారని రాహుల్‌ వివరించారు. ఆంధ్రాలో రైతులు కష్టాల్లో ఉన్నారని.. గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాహుల్ వెల్లడించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండు రోజులలో రైతు రుణాలను రద్దు చేస్తామని రాహుల్‌ గాంధీ వివరించారు.