విజయవాడ : పేదరికంపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఆదివారం విజయవాడలో కాంగ్రెస్ ఎన్నికల సభ జరిగింది. ఈ సభకు హాజరైన రాహుల్ మాట్లాడారు. దేశంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంతో దేశంలో ఎంతో మందికి ఉపాధి కల్పించామని ఆయన పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళలకు ఇచ్చామని ఆయన వెల్లడించారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబానికి రూ.72వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మోడీ హయాంలో దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు. నోట్ల రద్దు, జిఎస్ టితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో వ్యాపారాలు మూతపడే స్థితికి వచ్చాయని విమర్శించారు. రాఫెల్ డీల్ను మోడీ అనిల్ అంబానీకి ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. దేశానికి రోల్ మోడల్ గా ఎపిని తయారు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ధనవంతులకు చౌకీదారుగా ఉండే మోడీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. జీవితాంతం తాము పేదలకు మాత్రమే చౌకీదార్లుగా ఉంటామని రాహుల్ తేల్చి చెప్పారు.