వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోదరి, ఆ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆమె చంద్రబాబు ప్రభుత్వంపై, నారా లోకేష్పై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. ప్రసంగాల్లో పంచ్లను యాడ్ చేస్తూ వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు.
కాగా, శనివారం రాత్రి మంగళగిరి వేదికగా నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ..
బాబు వస్తే.. జాబు వస్తుందన్నాడు. చంద్రబాబు చెప్పింది నిజమే. జాబు వచ్చింది. కానీ ఆ జాబు ఆయన కుమారుడు నారా లోకేష్కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు, రెండు, కాదు ఏకంగా మూడుశాఖలకు నారా లోకేష్ను మంత్రిని చేశాడు. ఈ పప్పుగారికి కనీసం జయంతికి, వర్ధంతికి కూడా తేడా తేలీదు. అ ఆలు కూడా రావుకానీ, అగ్ర తాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు అంటూ నారా లోకేష్ను ఉద్దేశించి వైఎస్ షర్మిల అన్నారు.
ఒక్క ఎన్నిక కూడా గెలవకుండా ఏ అర్హత ఉందని నారా లోకేష్కు మూడు మంత్రిత్వశాఖలను అప్పగించారో చంద్రబాబు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పైగా తెలుగుదేశం పార్టీ వాళ్లు సిగ్గులేకుండా మాట్లాడుతూ నారా లోకేష్కు చాలా అవార్డులు వచ్చాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ పప్పుగారికి కూడా అవార్డులు వచ్చాయా..? ఆ అవార్డులు దేనికి పనికొస్తాయి..? నాలుక గీసుకొనేందుకా..? అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవ చేశారు.