నేడు ఏపీకి రాహుల్, మమత, కేజ్రీవాల్ !

SMTV Desk 2019-03-31 12:47:55  rahul, mamata, kejrival

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇంకా 12 రోజులే ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేనాని పవన్‌కళ్యాణ్ తదితరులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు దంచేస్తున్నారు. టీడీపీకి చంద్రబాబు, జనసేనకు పవన్‌కళ్యాణ్ అన్నీ తామై ప్రచారం నిర్వహిస్తుంటే, వైసీపీకి మాత్రం జగన్‌ కు తోడుగా ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ ప్రచారం చేస్తున్నారు. అయితే చంద్రబాబు తన చాణక్యాన్ని వాడి మోదీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు గతంలో జాతీయ నేతలను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారంతా చంద్రబాబుకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేసేందుకు క్యూ కడుతున్నారు.

ఇప్పటికే జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించగా, ఈరోజు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి కేజ్రీవాల్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం 5గంటలకు నిర్వహించే టీడీపీ ఎన్నికల ప్రచారసభలో వీరంతా పాల్గొంటారు. అయితే ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్‌గాంధీ ఈరోజు ఏపీలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకోనున్న రాహుల్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి బూత్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.