హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. సొంత పార్టీ కార్యకర్తపైనే దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే చాలా సార్లు బాలయ్య అభిమానుల మీద చెయ్యి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఓ మీడియా జర్నలిస్టును అసభ్య పదజాలంతో దూషించి అబాసులపాలైన బాలయ్య.. తాజాగా సొంత పార్టీ కార్యకర్తపైనే చిందులు తొక్కారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి వెళ్లిన బాలయ్యను.. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రవికుమార్ తమ గ్రామ చెరువుకు నీరు విడుదల చేయాలని కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన బాలయ్య.. రవికుమార్ను తోసేశారు. బయటకు పంపాలని పోలీసులను ఆదేశించగా..వారు అతన్ని అక్కడి నుంచి పంపేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రవికుమార్ వెంటనే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి.. సమీప గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్బాల్ సమక్షంలో పార్టీలో చేరారు.
రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఓ వీడియో జర్నలిస్టును నరికి పోగులు పెడతానంటూ బాలకృష్ణ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఆయన అభిమానులు, ఇతర సహాయకుల మీద దాడికి పాల్పడి విమర్శలు ఎదుర్కొన్నారు.