ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ మీద విమర్శలు చేయడం మానుకుని ముందు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని సూచిస్తూ.. ట్విటర్లో మండిపడ్డారు.
శుక్రవారం మహబూబ్నగర్లో జరిగిన సభలో ప్రసంగించిన ప్రధాన మంత్రి మోదీ టీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జ్యోతిష్యుడు చెప్పాడని అసెంబ్లీ రద్దు చేసి, ముందస్తు ఎన్నికలు జరిపారని ఆరోపించారు.
దీనిపై స్పందించిన కేటీఆర్ ‘ మోదీజీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ మీ టైమ్ వేస్ట్ చేసుకోకండి. ముందు మహబూబ్ నగర్ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జతీయ హోదా ఇస్తే చాలా ఆనందపడతారు’ అని ట్విటర్ కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీకి మహబూబ్నగర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేవని అన్నారు.